మెదక్ ఎన్నికపై కాంగ్రెస్, తెరాసల మధ్య అగ్గి
హైదరాబాద్/ మెదక్: మెదక్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పదవి తెలుగుదేశం వశం కావడంపై కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. మెదక్ మున్సిపాలిటీలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు తొమ్మిదేసి వార్డులను గెలుచుకున్నాయి. తెరాస ఆరు వార్డులు గెలుచుకుంది. తెరాసకు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు బలపరచడంతో మెదక్ మున్పిపల్ చైర్పర్సన్ పదవిని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఇది తీవ్ర సంచలనానికి కారణం కావడమే కాకుండా, కాంగ్రెస్ ఆగ్రహానికి కారణమైంది.
కాంగ్రెస్ శాసనసభ్యుడు పి. శశిధర్ రెడ్డి వల్లనే మెదక్ మున్పిపాలిటీని కోల్పోయామని తెరాస విమర్శిస్తోంది. అయితే దీన్ని శశిధర్ రెడ్డి ఖండిస్తున్నారు. కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలనే తెరాస నేత నరేంద్ర మాటల వెనక తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబునాయుడు హస్తం ఉందనే విమర్శలు దీని ద్వారా రుజువయ్యాయని ఆయన అన్నారు. మెదక్లో తెలుగుదేశం, తెరాసల నినాదాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
మెదక్లో తెలుగుదేశం పార్టీని బలపరిచిన ఆరుగురు తమ పార్టీ కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తామని తెరాస అగ్రనేత ఎ. నరేంద్ర చెప్పారు. తెరాస కౌన్సిలర్ల సహకారం తీసుకోవడం స్థానికమైందే తప్ప రాష్ట్ర స్థాయి నాయకత్వానికి సంబంధం లేదని తెలుగుదేశం నాయకుడు పెద్దిరెడ్డి అంటున్నారు.