బిజెపితో కాంగ్రెస్, టిడిపితో తెరాస దోస్తీ
హైదరాబాద్: మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్పన్ల ఎన్నికల్లో వీరు వారు, వారు వీరు అయ్యారు. సైద్ధాంతిక విభేదాలను, రాజకీయ విధానాలను పక్కన పెట్టి పరస్పరం మద్దతులు ఇచ్చుకోవడంతో మున్సిపాలిటీల్లో సమీకణాలు మారాయి. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మద్దతిస్తే, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) మద్దతు తీసుకుంది. పార్టీ నాయకత్వాల ఆదేశాలను ధిక్కరించి విధేయతలను మార్చారు.
మెదక్ మున్సిపాలిటీలో ఆరుగురు తెరాస కౌన్సిలర్లు తమకు బద్ధ శత్రువైన తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చారు. దీంతో తెలుగుదేశం అభ్యర్థి చైర్మన్గా ఎన్నికయ్యారు. ప్రతిగా తెరాస వైస్ చైర్మన్ పదవిని తీసుకుంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా భైంసాలో కూడా తెరాస కౌన్సిలర్లు కాంగ్రెస్ను కంగు తినిపించారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి వారు మద్దతిచ్చారు. మజ్లీస్, తెరాసలు కలిసి పాలకమండలి దక్కించుకుంటాయనే అంచనాలను వారు తలకిందులు చేశారు. తెరాస సహాయంతో తెలుగుదేశం పార్టీకి చెందిన గంగాధర్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మెదక్ జిల్లా సదాశివపేటలోనూ సమీకరణాలు మారాయి. తెరాస, మజ్లీస్ల రాజకీయాలతో ఇండిపెండెంట్ అనురాధ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమె తెరాస మద్దతుదారు.
ఇకపోతే, కాంగ్రెస్ తక్కువేమీ తినలేదు. జాతీయ స్థాయిలో బద్ధశత్రువైన బిజెపి మద్దతును కాంగ్రెస్ సంపాదించి ధర్మవరం, గుంతకల్ మున్సిపాలిటీలను దక్కించుకుంది. దీనిపై బిజెపి జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ తీవ్ర విమర్శలు చేయగా, దాన్ని పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావు సమర్థించుకున్నారు.
మొత్తంగా కాంగ్రెస్ 82 మున్సిపాలిటీ చైర్మన్ల పదవులను దక్కించుకోగా, తెలుగుదేశం పార్టీ 9 చైర్ పర్సన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెరాస సిద్ధిపేట, సంగారెడ్డి మున్సిపాలిటీల మేయర్ పదవులను గెలుచుకుంది. సిపియంకు ఒక మున్పిపల్ చైర్మన్ పదవి దక్కింది. ఒక మున్పిపల్ చైర్ పర్సన్ పదవి ఇండిపెండెంట్కు దక్కింది.