లేఖలు రాస్తే తప్పేమిటి?: శశిధర్ రెడ్డి
హైదరాబాద్: తాము లేఖలు రాస్తే తప్పేమిటని అసమ్మతి కాంగ్రెస్ శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. తనకు పార్టీ అధిష్ఠానం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్కు వివరణ ఇచ్చిన శశిధర్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తాము చేసిన ప్రకటనలపై దిగ్విజయ్సింగ్కు వివరణ ఇచ్చామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకే లేఖలు రాసినట్లు వచ్చిన విమర్శలను ఆయన కొట్టిపారేశారు. తాము ఎవరినీ ఇరుకున పెట్టడం లేదని, హైదరాబాద్ నగర అభివృద్ధి తమకు ముఖ్యమని ఆయన అన్నారు. నగరాభివృద్ధి లక్ష్యంగా తాము లేఖలు రాస్తే తప్పేమిటని ఆయన అడిగారు. తాము లేవనెత్తిన అన్ని అంశాలపై వివరణ ఇస్తామని దిగ్విజయ్ హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. చర్చించాల్సి వస్తే చర్చిస్తాం, లేఖలు రాయాల్సి వస్తే రాస్తామని ఆయన అన్నారు. పార్టీ వేదికల మీద మాట్లాడాల్సి వస్తే మాట్లాడుతామని ఆయన చెప్పారు. తాము లేవనెత్తిన అంశాలు ప్రజలకు సంబంధించినవని ఆయన అన్నారు.