హుస్సేన్సాగర్లో నిమజ్జనం కుదరదు: హైకోర్టు
హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం జరపడానికి వీలు లేదని హైకోర్టు ఆదేశించింది. రాజమౌళి కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయడానికి వీలు కాదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి భారతీయ పౌరుడి బాధ్యత అని హైకోర్టు గుర్తు చేసింది. గణేష్ నిమజ్జనం అనేది శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని, ఏకంగా హుస్సేన్సాగర్లో గణేష్ నిమజ్జనాన్ని నిషేధించడం సాధ్యం కాదని అడ్వొకేట్ జనరల్ మోహన్ రెడ్డి హైకోర్టుకు తెలియజేశారు. దీంతో ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
అలాగే ఐ మాక్స్, పివిఆర్ థియేటర్లలో అగ్ని ప్రమాదాల నివరాణకు తీసుకున్న చర్యలు సరిగా లేకపోవడం పట్ల మరో కేసులో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా అగ్ని ప్రమాదాల నివారణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు ఆ రెండు థియేటర్ల యజమాన్యాలను ఆదేశించింది.