ఆక్వా రైతులకు అండగా సీఎం చంద్రబాబు.. కేంద్రానికి కీలక లేఖ !!
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కీలక లేఖ రాశారు. రాష్ట్రంలోని లక్షలాది ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ, రొయ్యల ఫీడ్ ముడిసరుకుల ధరల పెరుగుదలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు రైతులను తీవ్ర ఆర్థిక ఒత్తిడిలోకి నెడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రూ.25 వేల అదనపు భారం..
రొయ్యల ఫీడ్ తయారీలో కీలకంగా ఉపయోగించే సోయాబీన్ మీల్, సోయా ఆయిల్ వంటి ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో రైతుల పెట్టుబడి ఖర్చులు అమాంతం పెరిగిపోయాయని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక్క టన్ను ఫీడ్పై సుమారు రూ.25 వేల వరకు అదనపు భారం పడుతోందని తెలిపారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు, కార్మిక వ్యయం, ఎగుమతి ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో ఈ అదనపు భారం రైతులకు తట్టుకోలేని స్థాయికి చేరిందని అన్నారు.

కాగా పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న లాభాలతో పలువురు రైతులు ఆక్వా సాగును నిలిపివేయాలని ఆలోచిస్తున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనివల్ల ఎగుమతులు తగ్గిపోవడంతో పాటు వేలాది మందికి ఉపాధి సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
ఆంక్షలు సడలించాలని విజ్ఞప్తి..
సమస్య పరిష్కారానికి కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. రొయ్యల ఫీడ్ తయారీలో కీలకమైన సోయాబీన్ మీల్, సోయా ఆయిల్ దిగుమతులపై ఉన్న ఆంక్షలను సడలించాలని కోరారు. అవసరమైతే దిగుమతి సుంకాలను తగ్గించి, రైతులకు తక్కువ ధరలకు ముడిసరుకులు అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలానే ఫీడ్ కంపెనీలు అనవసరంగా ధరలు పెంచకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. రైతులకు నాణ్యమైన ఫీడ్ సరసమైన ధరలకు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆక్వా రంగానికి ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీ ప్రకటించాలని కూడా సూచించినట్లు సమాచారం.
దేశ ఆర్థిక వ్యవస్థలో ఆక్వా రంగం కీలకం..
ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద ఆక్వా ఉత్పత్తి రాష్ట్రంగా నిలిచిందని, రొయ్యల ఎగుమతుల ద్వారా భారీ విదేశీ మారకద్రవ్యం దేశానికి వస్తోందని సీఎం గుర్తుచేశారు. లక్షలాది కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయని, ఆక్వా రంగాన్ని కాపాడటం అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను రక్షించడమేనని పేర్కొన్నారు. ఆక్వా రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు చర్యపై రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం వెంటనే స్పందించి ధరల నియంత్రణ చర్యలు చేపడితే ఆక్వా రంగానికి ఊరట లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications