గుజరాత్ సిఎం గా మోడీ ప్రమాణ స్వీకారం నేడే
గాంధీ నగర్ : నరేంద్ర మోడీ మంగళవారం గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యాహ్నం 12.50 గంటలకు గాంధీ నగర్లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనుంది. సోమవారం బీజేపీ శాసనసభా పక్ష నేతలు నరేంద్ర మోడీని సోమవారం ముఖ్యమంత్రిగా, శాసనసభా పక్ష నేతగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ తాజా ఎన్నికల్లో 117 సీట్లు గెలుచుకొని కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది.
మాజీ ప్రధాని, బీజేపీ కీలక నేత అటల్ బీహారీ వాజ్పేయి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం గుజరాత్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలని బీజేపీ నిర్ణయించింది. తాజా ఎన్నికల్లో సొంత పార్టీలో అసమ్మతిని, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి మహారథుల ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కుని తాజా ఎన్నికల్లో బీజేపీకి మోడీ మూడింట సుమారు రెండొంతుల మోజారిటీ సాధించిపెట్టాడు.