తెరాస రాజీనామాల ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుల రాజీనామాలను శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి శుక్రవారంనాడు ఆమోదించారు. రాజీనామాలపై పునరాలోచన చేయాలని స్పీకర్ ఇంతకు ముందు తెరాస శాసనసభ్యులను కోరారు. అయితే రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని తెరాస శాసనభ్యులు తేల్చిచెప్పారు. దీంతో స్పకర్ 16 మంది తెరాస శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించారు.
తెరాస శాసనసభ్యుల రాజీనామాలపై రేపు నిర్ణయం తీసుకుంటానని గురువారంనాడు ఢిల్లీ వచ్చిన సురేష్ రెడ్డి చెప్పారు. ఆ మేరకు శుక్రవారంనాడు నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాలు ఆమోదించిన విషయాన్ని స్పీకర్ ఎన్నికల సంఘానికి కూడా తెలియజేశారు. పది రోజుల లోగా ఆ స్థానాలు ఖాళీ అయినట్లు ఎన్నికల కమీషన్ గెజిట్ లో పేర్కొంటుంది. స్థానాలు ఖాళీ అయిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఖైరతాబాద్ సీటు పి. జనార్దన్ రెడ్డి మృతి వల్ల ఖాళీ అయింది. ఈ స్థానంతో పాటు తాము రాజీనామాలు చేయడం ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని తెరాస నాయకులు భావిస్తున్నారు. మే ఆఖరులోగా ఉప ఎన్నికలు జరుగుతాయని వారనుకుంటున్నారు.
తెరాస పార్లమెంటు సభ్యుల రాజీనామాలను లోకసభ స్పీకర్ సోమనాధ్ ఛటర్జీ ఇప్పటికే ఆమోదించారు. నలుగురు తెరాస లోకసభ సభ్యులు రాజీనామాలు చేయడంతో ఆదిలాబాద్, కరీంనగర్, హన్మకొండ, వరంగల్ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటికి కూడా అదే సమయంలో ఉప ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే నవంబర్ లో లోకసభకు, దానితో పాటు రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరగవచ్చునని, అందువల్ల ఉప ఎన్నికలు జరగకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications