న్యూ డిల్లీ, జూన్ 4:విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రణబ్ ముఖర్జీ నేటినుండీ నాలుగు రోజులపాటు చైనాలో పర్యటిస్తారు. తన అధికారిక పర్యటనలో భాగంగా దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదం తో పాటూ ఇరువురికి లాభదాయకమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలను చర్చిస్తారు. ఆయన 2005 లో జరిగిన ఒప్పందంలోని మార్గదర్శక, రాజకీయ సూత్రాల ప్రకారం సరిహద్దు వివాదాన్నిగూర్చి చైనా విదేశాంగ మంత్రి యాన్ జెయిచి తో చర్చిస్తారు. చైనా విదేశాంగ మంత్రి యాన్ జెయిచి పిలుపు మేరకే ఆయన చైనా పర్యటన ఖరారైంది. పర్యటనలో భాగంగా బీజింగ్ లో చైనా ప్రధాన మంత్రి వెన్ జియాబావోని కూడా కలుస్తారు. వాటితో పాటూ టిబెట్, జల వివాదాలకి సంబంధించిన విషయాలు కూడా చర్చల్లో చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇరు దేశాలమధ్య 2010 కల్లా 60 బిలియన్ డాలర్ల విదేశీ వ్యాపారం జరగాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాల అభివృద్ది కూడా చర్చల్లో భాగమయ్యే అవకాశం ఉంది.శ్రీ ప్రణబ్ ముఖర్జీ 'గువాంగ్జౌ' లో కొత్త 'భారత్ కాన్సులేట్ జనరల్' ను ప్రారంభిస్తారు.భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ జనవరి 13 నుండి 15 వరకు పాల్గొన్న చైనా పర్యటన అనంతరం భారత్ నుండి ఒక అత్యున్నత స్దాయి మంత్రి చైనాను సందర్శించడం ఈ మద్య కాలంలో ఇదే మొదటి సారి . ద్వైపాక్షిక సంబంధాల విషయమై చైనాను సందర్శించిన చివరి విదేశాంగమంత్రి శ్రీ జస్వంత్ సింగ్. ఆయన 2002 మార్చి 29 నుండి ఏప్రిల్ 2 మధ్య చైనాను పర్యటించారు.