సింగ్ ఈస్ కింగ్ ప్రదర్శనకు ఆటంకం
అమృత్ సర్: సింగ్ ఈస్ కింగ్ సినిమా ప్రదర్శనకు అమృత్ సర్ లో శుక్రవారం ఉదయం ఆటంకం ఏర్పడింది. ఈ సినిమా తొలి ప్రదర్శనను సిక్కు కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎన్ఎం సినిమా హాల్ ను సిక్కు కార్యకర్తలు చేరుకుని నిరసన ప్రదర్శనకు దిగారు. సిక్కులను ప్రతికూల దృష్టితో సినిమాలో చూపారని ఆరోపిస్తూ వారు ఈ నిరసన ప్రదర్శనకు పూనుకున్నారు. సింగ్ ఈస్ కింగ్ లో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.
పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు సినిమా హాల్ కు చేరుకున్నారు. నిరసనకు రాడికాల్ సిక్ సంస్థ దాందామీ తక్సల్ పిలుపునిచ్చింది. సింగ్ ఈస్ కింగ్ సినిమా దేశవ్యాప్తంగా శుక్రవారంనాడు విడుదలైంది. రాష్ట్రంలో సినిమా విడుదలైన చోట్ల పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరెక్కడా సినిమా ప్రదర్శనకు ఆటంకాలు ఏర్పడినట్లు వార్తలు రాలేదు. ఒక కమిటీ సమీక్షించిన తర్వాత సినిమా ప్రదర్శనకు అభ్యంతరం లేదని ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ గురువారంనాడు తెలియజేసింది. అయితే పంజాబ్ కు చెందిన కొన్ని సిక్కు సంస్థలు మాత్రం సినిమాను వ్యతిరేకిస్తున్నాయి.












Click it and Unblock the Notifications