రాజ్నాథ్ సింగ్ కొడుకు నీరజ్కు కీలక పదవి!
ఉత్తరప్రదేశ్ బీజేపీ తన కొత్త సంస్థాగత కమిటీని అధికారికంగా ప్రకటించింది. రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు సుదీర్ఘ కసరత్తు తర్వాత 46 మందితో కూడిన ఈ నూతన కమిటీ జాబితాను విడుదల చేశాయి. ఈ కొత్త జాబితాలో యూపీలోని సంక్లిష్టమైన కుల సమీకరణాలను సమతుల్యం చేయడంతో పాటు పలు ఆశ్చర్యకరమైన పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా అగ్ర నాయకుల వారసులకు, ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన కీలక నేతలకు ఈ జాబితాలో పెద్ద పీట వేశారు.
రాజ్నాథ్ సింగ్ కుమారుడికి కీలక బాధ్యత!
ఈ నూతన కమిటీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రెండో కుమారుడు నీరజ్ సింగ్కు కీలకమైన రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి లభించింది. ఇప్పటివరకు ఈ కమిటీలో ఉన్న రాజ్నాథ్ పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే పంకజ్ సింగ్ స్థానంలో ఇప్పుడు నీరజ్ సింగ్ను నియమించారు. అలాగే సమాజ్వాదీ పార్టీకి తిరుగుబాటు ఎమ్మెల్యేగా మారి విపక్ష శిబిరంలో సంచలనం సృష్టించిన పూజా పాల్ను బీజేపీ తన టీమ్లోకి ఆహ్వానించి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పెద్ద బాధ్యతను అప్పగించింది. మరో సీనియర్ మహిళా నాయకురాలు, బారాబంకికి చెందిన ప్రియాంకా రావత్ను గతంలో ఉన్న ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ప్రమోట్ చేశారు.

కుల సమీకరణాలపై ప్రత్యేక ఫోకస్
బీజేపీ అధిష్టానం ఈ సంస్థాగత మార్పుల ద్వారా యూపీలో సామాజిక సమీకరణాలను పటిష్టం చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా దళిత, వెనుకబడిన వర్గాలలో బలమైన పట్టున్న ప్రియాంకా రావత్ లాంటి నేతలను ముందుకు తీసుకురావడం ద్వారా ఆయా వర్గాల్లో పార్టీ మైలేజ్ పెంచాలని యోచిస్తోంది. గతంలో సంస్థాగత వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించిన సంజయ్ రాయ్పై అధిష్ఠానం మళ్లీ నమ్మకం ఉంచి, ఆయనను తిరిగి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయనతో పాటు దూకుడున్న ఎమ్మెల్యే రాజేష్ చౌదరిని కూడా కొత్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించి కీలక బాధ్యతలు అప్పగించారు. యువతను పార్టీ వైపు ఆకర్షించడానికి రోహిత్ మిశ్రాను యువమోర్చా కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.
ఉత్తరప్రదేశ్ బీజేపీ నూతన పదాధికారుల పూర్తి జాబితా:
రాష్ట్ర ఉపాధ్యక్షులు: సురేష్ రాణా, సత్యపాల్ సైనీ, బ్రజ్ బహదూర్, ధర్మేంద్ర సింగ్, మోహిత్ బెనివాల్, దేవేష్ కోరి, ప్రియాంకా రావత్, దర్విజయ్ శాక్య, రమేష్ సింగ్, నీరజ్ సింగ్, అర్చనా మిశ్రా, పూజా పాల్ (ఎస్పీ తిరుగుబాటు నేత), శంకర్ గిరి, కామేశ్వర్ సింగ్, కృతికా అగర్వాల్, సురేష్ మౌర్య, రాజేష్ యాదవ్, కృష్ణ బిహారీ రాయ్, ఆలోక్ గుప్తా.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు: రాంప్రతాప్ సింగ్ చౌహాన్, గీతా శాక్య, అభిజాత్ మిశ్రా, ఉపేంద్ర రావత్, సంజయ్ రాయ్, శంకర్ లోధి, దిలీప్ పటేల్, రాజేష్ చౌదరి.
రాష్ట్ర కార్యదర్శులు: విజయ్ శివహరే, బసంత్ త్యాగి, శివభూషణ్ సింగ్, సహజానంద్ రాయ్, అంకుర్ శర్మ, అనిల్ యాదవ్, అవధేష్ శ్రీవాస్తవ, విజయ్ రాజ్భర్, ప్రమేంద్ర జాంగ్రా విశ్వకర్మ, కిరణ్ లోధి నిషాద్, రాకేష్ బింద్, సంచితా సింగ్ చౌహాన్ (లునియా), రజనీ పాండే, రాహుల్ వాల్మీకి, మహామేధా నగర్, దీపమాలా సంతోషి, సుహాసిని జైస్వాల్, యతేంద్ర శర్మ, ఆకాంక్ష సోంకర్.
ప్రాంతీయ అధ్యక్షులు, అనుబంధ మోర్చాల బాధ్యతలు:
యూపీలోని వివిధ ప్రాంతాలకు ప్రాంతీయ అధ్యక్షులుగా నవాబ్ సింగ్ నగర్ (పశ్చిమ), పూరన్ లాల్ లోధి (బ్రజ్), రామ్ కిషోర్ సాహూ (కాన్పూర్), అవధేష్ ద్వివేది (అవధ్), అశోక్ చౌరాసియా (కాశీ), వినోద్ రాయ్ (గోరఖ్పూర్) నియమితులయ్యారు. వీటితో పాటు దినేష్ ప్రతాప్ సింగ్ను ముఖ్య ప్రతినిధిగా, మనీష్ దీక్షిత్ను మీడియా కోఆర్డినేటర్గా నియమించారు. అనుబంధ మోర్చాల అధ్యక్షులుగా రోహిత్ మిశ్రా (యువమోర్చా), ప్రకాష్ పాల్ (వెనుకబడిన మోర్చా), దేవేంద్ర సింగ్ (కిసాన్ మోర్చా), అశోక్ రావత్ (షెడ్యూల్డ్ మోర్చా), సరోజ్ కుష్వాహా (మహిళా మోర్చా), విద్యాభూషణ్ గోండ్ (షెడ్యూల్డ్ తెగల మోర్చా) బాధ్యతలు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications