బెల్టు షాపులపై అసెంబ్లీలో రభస
హైదరాబాద్: రాష్ట్రంలో బెల్టు షాపులపై మంగళవారం శాసనసభలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వ మద్యం విధానంపై ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్టు షాపులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. మద్యం విధానాన్ని తప్పు పడుతూ ప్రభుత్వం ప్రజల రక్తం తాగుతోందని ఆయన అన్నారు. దీనికి మంత్రి కొణతాల రామకృష్ణ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ తమ కన్నా ముందే తెలుగుదేశం పార్టీ ప్రజల రక్తం తాగి పీల్చి పిప్పి చేసిందని ఆయన అన్నారు. ఇప్పుడే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు పోదామని, ఎవరు గెలుస్తారో చూద్దామని ఆయన ఒకానొక సందర్భంలో సవాల్ చేశారు.
మద్యం విధానంపై వేసిన ప్రశ్నలకు మంత్రి కొణతాల రామకృష్ణ సరైన సమాధానం ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ తెలుగుదేశం సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి తిరస్కరించారు. అయినా ప్రతిపక్షాలు పట్టు వీడలేదు. తెలంగాణ ప్రాంతీయ బోర్డు విషయంలో ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు విమర్శించారు. దీనిపై తక్షణ చర్చకు పట్టుబట్టారు. స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో సభా కార్యక్రమాలు దాదాపు 50 నిమిషాల పాటు స్తంభించాయి. తెలంగాణలోని దేవాలయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications