కర్ణాటకకు టాటా నానో ప్రాజెక్టు?
బెంగుళూర్: టాటా మోటార్స్ ప్రతిష్టాత్మకమైన నానో కార్ల ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సింగూరు నుంచి కర్ణాటక రాష్ట్రానికి తరలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నానో కార్ల ప్రాజెక్టు స్థాపనకు కర్ణాటక ప్రభుత్వం వేయి ఎకరాల భూమిని కేటాయించేందుకు ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యూరప్పతో సమావేశమైన అనంతరం టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి. రవికాంత్ ఆ విషయం చెప్పారు. ప్రాజెక్టును తమ రాష్ట్రంలో నెలకొల్పితే పూర్తి మద్దతు, సహకారం, అవసరమైన రాయితీలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు.
తమ ప్రాజెక్టుకు వేయి ఎకరాల భూమి అవసరమవుతుందని, ఇది ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు అని ఆయన చెప్పారు. అవసరమైతే తమ ప్రాజెక్టును సింగూరు నుంచి తరలిస్తామని ఆయన చెప్పారు. అయితే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని, భూ కేటాయింపు వివాదం ముగియాల్సి ఉందని ఆయన చెప్పారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని ధార్వాడ్ లో ఉత్పత్తి సౌకర్యాలు టాటాకు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికే టాటా మోటార్స్ బస్సులను, ట్రాక్టర్లను తయారు చేస్తోంది. తాము సింగూరు నుంచి ప్రాజెక్టును తరలించడానికి వెనకాడబోమని టాటా మోటార్స్ చైర్మన్ ప్రకటించిన వెంటనే కర్ణాటక, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్వానం పలికాయి.












Click it and Unblock the Notifications