లక్ష డాలర్లతో తానా సహాయ నిధి
షికాగో: అమెరికాలో ఆకస్మికంగా మృతిచెందిన తోటి ప్రవాసాంధ్రుల కోసం లక్ష డాలర్లతో అత్యవసర సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తమ వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు 'తానా' కార్యనిర్వాహక వర్గం వెల్లడించింది.
అమెరికాలో హటాత్తుగా తమ వారు మృతిచెందితే, చట్టపరమైన నిబంధనలు తెలీక తెలుగు వారు ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న తెలుగు వారికి సహాయం చేసే నిమిత్తం వంద మంది స్వచ్ఛంద సేవకులతో కూడిన అత్యవసర సహాయ కమిటీని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఏర్పాటు చేయ తలపెట్టింది.
ఇందుకోసం లక్ష డాలర్లతో అత్యవసర సహాయ నిధిని కూడా ఏర్పాటు చేస్తోంది. ఎవరైనా కుటుంబ సభ్యులు మృతిచెందినపుడు, ఎవరిని సంప్రదించాలన్న వివరాలను తానా సైట్లో పొందుపరుస్తారు. అలాగే దగ్గరలోని స్వచ్చంద సేవకుల వివరాలను పొందవచ్చు. అదే విధంగా ఈ దిశగా ఎదురైన అనుభవాలను ఎవరైనా తానా వెబ్సైట్లో పంచుకోవచ్చు.
టీం స్క్వేర్ అనే పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం అక్టోబర్ 25న షికాగోలో జరగనున్న అధికారిక సమావేశంలో ప్రారంభం కానున్నది. టీం స్క్వేర్లో స్వచ్ఛందంగా పాల్గొనదలచిన కార్యకర్తలు తమ వివరాలు తానాకు తెలియజేయవచ్చు. అదే విధంగా ధన సహాయం చేసే వారు వెబ్సైట్లో క్రెడిట్ కార్డు ద్వారా చేయవచ్చని వారు వివరించారు












Click it and Unblock the Notifications