చిరు వైఖరి తర్వాతే కాంగ్రెస్ నిర్ణయం

సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ సూచనల మేరకు వైఎస్ తెలంగాణపై తన అభిప్రాయాలను సవివరంగా తెలియజేశారు. పొత్తులు, ఎత్తులపరంగా తన వాదనలు వినిపించారు. చిరంజీవికున్న రాజకీయ బలంపై అంచనాకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. పార్టీ నిర్వహించిన సర్వేల సారాంశాన్ని తెలియజేశారు. 'అన్ని అవకాశాలకు తలుపులు తెరిచే ఉంచాలి. పరిణామాలను నిశితంగా గమనించాలి. తప్పనిసరై తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోదలిస్తే అది కాంగ్రెస్కే ఉపయోగపడాలి. ఇతర పార్టీలకు ఆ ప్రతిష్ట దక్కకూడదు. కొందరు తెలంగాణ సీనియర్ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒత్తిడి తెస్తున్నారనే కారణంతో తుది నిర్ణయానికి రావద్దు' అని వైయస్ అధిష్ఠానవర్గానికి వివరించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత సానుకూల పరిస్థితి ఉందన్నారు. నాలుగున్నరేళ్లుగా తమ ప్రభుత్వంచేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వ వ్యతిరేకతను గణనీయంగా తగ్గించాయని, తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యాల మధ్య కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, కాంగ్రెస్కు లబ్ధి చేకూరుతుందని అని ఆయన చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై చిరంజీవి ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రానందున ఇంకొంతకాలం వేచిచూడాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. తెదేపా-తెరాస-వామపక్షాల కూటమి, చిరంజీవి వైఖరివల్ల జరుగబోయే నష్టాన్ని బేరీజువేసి ఆలోచిద్దామని భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications