పులివెందులలో పిఆర్పీ నేతలపై దాడి
కడప: బుధవారం జరగబోయే చిరంజీవి రోడ్ షోకు ఏర్పాట్లు చేయడానికి వచ్చిన ప్రజారాజ్యం రాష్ట్ర నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. బ్యానర్లు కట్టుకుందామని అనుమతులతో బయలుదేరిన అభిమానులను పరిగెత్తించి ముచ్చెమటలు పట్టించారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి రోడ్షోను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు పులివెందులలో విధ్వంసానికి దిగారు. రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద ప్రరాపా నాయకులు శోభానాగిరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి కోటగిరి విద్యాధరరావు, సినీ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ల కార్లను ధ్వంసం చేశారు. మరో నాలుగు సుమోల అద్దాలు పగులగొట్టారు. ఇంత భారీ ఎత్తున విధ్వంసకాండ జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహింాచరు. . శోభ భద్రతా సిబ్బందిని చొక్కా కాలర్లు పట్టుకొని ఈడ్చేశారు. దొండ్లవాగు గ్రామానికి చెందిన ఒక నాయకుడి ఆధ్వర్యంలో 15 మంది దుండగులు పట్టణమంతా కలియతిరుగుతూ సాయంత్రం 7 గంటల నుంచి బీభత్సం సృష్టించారు.
మరోపక్క కోటగిరి విద్యాధరరావు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహం మందు ధర్నా చేశారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్, ముఖ్యమంత్రి బంధువు వై.ఎస్.మనోహర్రెడ్డి, జగన్ మామ ఈ.సి.గంగిరెడ్డి తదితరులు కోటగిరితో చర్చలు జరిపారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆగడాలను ప్రజారాజ్యం కార్యకర్తలకు ఎస్పీకి విన్నవించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినందుకు క్షమాపణచెప్పాలని వారు డిమాండ్ చేశారు.
పోలీసుల సమక్షంలో ప్రజారాజ్యం నాయకులపై దాడులు జరిగాయనడంలో వాస్తవం లేదని జిల్లా ఎస్పీ డి.ఎస్.చౌహాన్ అన్నారు. అల్లర్ల గురించి సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి తరలి వెళ్లి గుంపును చెదరగొట్టారని, నేతలను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారని తెలిపారు. పట్టణంలో అక్కడక్కడా గొడవలు జరిగింది నిజమేనన్నారు. దాడులు జరుగుతున్నప్పుడు అక్కడే పోలీసులున్నట్లు మీడియా క్లిప్పింగులు చూపిస్తే వారిని సస్పెండు చేస్తానని చెప్పారు. పరిస్థితి అదుపులో ఉందని, ఇక మీదట ఎలాంటి సంఘటనలు జరగవని ప్రకటించారు.
పులివెందులలో సీఆర్పీ పోలీసు బలగాల బందోబస్తుతో ఎన్నికలు జరిపిస్తే తమ పార్టీకి వచ్చే మొదటి సీటు పులివెందులే అవుతుందని ప్రజారాజ్యం పా ర్టీ ప్రతినిధి కోటగిరి విద్యాధరరావు చెప్పారు. దాడులు చేయించడం ద్వారా వైఎస్ తన నైజం ఏమిటో చాటుకున్నారని ప్రజారాజ్యం నేత సి.రామచంద్రయ్య అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రంలో ఎక్కడా తిరగ లేరని హెచ్చరించారు. శోభా నాగిరెడ్డిపై దాడి దారుణమని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, పీఆర్పీ నేత డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి అన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని విమర్శించారు.
సామాజిక న్యాయ రాజకీయాలకు భయపడే పులివెందులలో కాంగ్రెస్ నేతలు తమ పార్టీ నాయకులపై దాడి చేశారని ఆ పార్టీ నేతలు నాగబాబు, అల్లు అరవింద్, తమ్మినేని సీతారాంలు విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు(మంగళవారం) చీకటి రోజని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఈ ఘటనను చూస్తే తెలుస్తోందన్నారు. అప్రజాస్వామ్యానికి ఇదో నిదర్శనవతీ కాంగ్రెస్ దాడులకు పాల్పడినంత మాత్రాన మేం ప్రతిదాడులకు దిగబోమని చెప్పారు. చిరు అభిమానులు సంయమనం పాటించాలన్నారు. పులివెందుల ఘటనపై బుధవారం తాము రాష్ట్రవ్యాప్తంగా గాంధేయ మార్గంలో శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పారు. గాంధీ విగ్రహాల వద్ద శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా చిరంజీవి పర్యటనలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు.












Click it and Unblock the Notifications