అయిష్టంగానే టిడిపితో పొత్తు: బర్దన్
న్యూఢిల్లీ: రాష్ట్రంలో పొత్తుల నిర్ణయంపై సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్ సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీతోనే పొత్తు పెట్టుకోవాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు బర్దన్ కారత్ కు తెలియజేశారు. ఈ మేరకు ఆయన కారత్ కు ఫోన్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా జాతీయ స్థాయిలో వామపక్షాల ఐక్యతను కోరుకుంటూ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కార్యకర్తల ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నందున రాష్ట్రంలో ఎక్కువ సీట్లు అడుగుతున్నట్లు ఆయన కారత్ తో చెప్పారు. ఈ విషయాలపై మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. దేశంలో వామపక్షాల, లౌకిక, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత కోసం, మూడో కూటమి ఏర్పాటు కోసం సిపిఐ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రకాష్ కారత్ అభినందించారు. సిపిఐ రాష్ట్రసమితి సమావేశాలు మూడు రోజుల పాటు జరిగాయి. పొత్తులపై సిపిఐ, సిపిఎం కేంద్ర నాయకత్వాలు ఈ నెలాఖరున చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications