తెర మీదికి వైయస్ అల్లుడు అనిల్
హైదరాబాద్: ఒక వైపు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించగా, ఆయన అల్లుడు అనిల్ కుమార్ కూడా తెర మీదికి వస్తున్నారు. జగన్ వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కూడా చెప్పారు. జగన్ ప్రస్తుతం రోడ్ షోలతో బిజీగా ఉండగా, అనిల్ కుమార్ హైదరాబాదులో మరో రకంగా బిజీగా ఉన్నారు. అనిల్ కుమార్ క్రిస్టియన్ మతబోధకుడిగా ప్రజలకు ప్రబోధాలు వినిపించడానికి సమాయత్తమయ్యారు. హైదరాబాదులో అనిల్ కుమార్ కు సంబంధించిన ట్విన్ సిటీస్ గ్రాండ్ క్రిస్టమస్, జీసస్ క్రీస్ట్ బ్లెస్సింగ్స్ ఫెస్టివల్ హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. ఈ కార్యక్రమం డిసెంబర్ పదో తేదీన ప్రారంభమవుతుంది.
అనిల్ కుమార్ అనిల్ వరల్డ్ ఎవాంజలిజం సంస్థ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రబోధాలు వినిపించడానికి సిద్ధమవుతోంది. 36 ఏళ్ల ఈ ఎవాంజలిస్టు నిరుడు భీమవరం, రాజమండ్రి, వరంగల్లుల్లో పెద్ద యెత్తున తన మత ప్రసంగాలను వినిపించారు. అయితే అనిల్ కుమార్ పుట్టుకతో క్రైస్తవుడు కారు. రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. మొత్తం మీద క్రైస్తవ మతబోధకుడిగా అనిల్ కుమార్ హైదరాబాదులో మెగా ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. క్రైస్తవ మత బోధకుడు పాల్ ను దెబ్బ కొట్టేందుకు కాదు గదా.