కడియం, జీవన్ ల మధ్య వాగ్యుద్ధం
హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు కడియం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి టి. జీవన్ రెడ్డి మధ్య మంగళవారం శాసనసభలో వాగ్యుద్ధం జరిగింది. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా ఈ వాగ్వివాదం చోటు చేసుకుంది. బాబ్లీ ప్రాజెక్టును ఆపించడంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కడియం శ్రీహరి విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గొదావరి నీటి ప్రవాహం ఆంధ్రప్రదేశ్ కు తగ్గకుండా చెక్ డ్యాంలను మాత్రమే నిర్మిస్తోందని మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీధర్ బాబు చెప్పారని ఆయన గుర్తు చేశారు. 2005లో తాము బాబ్లీ ప్రాజెక్టు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చినప్పుడు ఆ మాట అన్నారని ఆయన చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ఒక్క చుక్క నీరు కూడా రాదని, తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని కడియం శ్రీహరి అన్నారు. రాజకీయ చేస్తున్నారని జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమయంలో జీవన్ రెడ్డి జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీ రాజకీయమే చేస్తోందని అన్నారు. దీంతో కడియం శ్రీహరికి, జీవన్ రెడ్డికి మధ్య వాగ్వివాదం చెలరేగింది.