ఇసుక స్కాంపై అసెంబ్లీలో జెసి డిమాండ్
హైదరాబాద్: రాష్ట్రమంత్రులు గొల్లపల్లి సూర్యారావు, మంత్రి జేసీ దివాకరరెడ్డిల మధ్య ఇసుక కుంభకోణం వివాదం మంగళవారం శాసనసభలో చర్చనీయాంశం అయింది. వీరిద్దరి పరస్పర ఆరోపణలపై నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని విపక్షాలు అన్నాయి. దీంతో అధికారపక్ష సభ్యులకు, విపక్షాలకు మధ్య వాగ్వాదం జరిగింది. తనపై చేసిన ఆరోపణలపై విచారణకు సభాసంఘాన్ని వేయాలని మంత్రి జేసీ దివాకరరెడ్డి సభలో డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని అందుకే తాను విచారణ కోరుతున్నానని అన్నారు. అయితే ఈ విషయంపై కేసు హైకోర్టులో ఉన్నందున సభాసంఘాన్ని వేయటం కుదరదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా ఏడు కోట్ల రూపాయల ఇసుక కుంభకోణంపై సభా సంఘం వేయాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. తూర్పు గోదావరి జిల్లా ఇసుక కుంభకోణంలో మంత్రి జెసి దివాకర్ రెడ్డి పాత్ర ఉందని మరో మంత్రి గొల్లపల్లి సూర్యారావు గతంలో ఆరోపించారు. దీంతో మంత్రుల మధ్య తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి విచారణకు ఆర్థిక మంత్రి కె. రోశయ్య నేతృత్వంలో మంత్రుల కమిటీని వేశారు. ఈ కమిటీ ఇరువురు మంత్రుల వాదనలు విన్నది. ఎట్టకేలకు రోశయ్య ఆ ఇరువురు మంత్రుల మధ్య రాజీ కుదిర్చారు.