ముంబై దాడులు: ఆంధ్రలో ఒకరి అరెస్టు
విజయవాడ: ముంబయి ఉగ్రవాదుల దాడులకు సంబంధించి కృష్ణా జిల్లా తిరువూరులో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించిన ఇ-మెయిల్ వచ్చిందనే అనుమానంతో మస్తాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సాయంత్రానికి పూర్తి వివరాలు వెల్లడించగలమని పోలీసులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా పోలీసులు మస్తాన్ కు ఇ-మెయిల్ వచ్చిన విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఆ విషయాన్ని అతను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
మస్తాన్ నడుపుతున్న కంప్యూటర్ సెంటరుపై పోలీసులు దాడి చేశారు. సెల్ ఫోనును, కంప్యూటర్ హార్డ్ డిస్కును స్వాధీనం చేసుకున్నారు. మస్తాన్ గతంలో హైదరాబాదులో కొంత కాలం పని చేసినట్లు తెలుస్తోంది. అనంతరం తిరువూరు వచ్చి కంప్యూటర్ సెంటరును నడుపుతున్నట్లు చెబుతున్నారు. పాకిస్థాన్ లో మస్తాన్ కు ఉన్న బంధువులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.