రైతు సమస్యలపై విపక్షాల పాదయాత్ర
హైదరాబాద్: రైతు సమస్యలపై శుక్రవారం విపక్షాల నాయకులు హైదరాబాదులో పాదయాత్ర చేశారు. బషీర్ బాగ్ చౌరస్తా నుంచి శాసనసభ వరకు వారు పాదయాత్ర చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో పాటు ఇతర పార్టీల నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ పాదయాత్ర చేశామని చంద్రబాబు చెప్పారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతు సమస్యలపై ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేకమైందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. అనంతరం రైతు సమస్యలపై ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ తీర్మానాన్ని స్పీకర్ కె. సురేష్ రెడ్డి తిరస్కరించారు.