అసెంబ్లీలో మజ్లీస్, టిడిపిల తోపులాట
హైదరాబాద్: శాంతిభద్రతల విషయమై ఈరోజు అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర గందరగోళం జరిగింది. బాబ్రీ మసీదు విధ్వంసంవల్లే దేశంలో తీవ్రవాదం పెరిగిందని, ఇందుకు ఎన్డిఏ, టీడీపీ కారణమని ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇరువైపులా వాగ్వాదం జరిగింది. దీంతో ఎంఐఎం సభ్యులు విపక్షాలవైపు దూసుకుని వచ్చారు. మజ్లీస్ సభ్యులు టిడిపి, బిజెపి సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఎంఐఎంపై నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ, వామపక్షాలు, బిజెపి స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ సురేష్ రెడ్డి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. ఉగ్రవాదులను సమర్థిస్తూ మాట్లాడిన అక్బరుద్దీన్ను అరెస్టు చేయాలని కోరుతూ బిజెపి సభ్యుడు కిషన్రెడ్డి స్పీకర్ ఛాంబర్ ముందు బైఠాయించారు. మజ్లీస్ సభ్యులపై టిడిపి, వామపక్షాల సభ్యులు స్పీకర్ కె. సురేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
దేశంలో, రాష్ట్రంలో ముస్లింలకు రక్షణ లేకుండాపోయిందని, ఎక్కడ ఏం జరిగినా ముస్లిం యువకులను వేధింపులకు గురిచేస్తున్నారని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపి యువకులను మట్టుబెడుతున్నారని, ఏం జరిగినా పట్టుకునిపోయి చిత్రహింసలు పెడుతున్నారని అన్నారు. ముంబైలో పోలీసుకాల్పుల్లో మృతి చెందిన ముస్లింల సంగతి ఎవరికీ పట్టటం లేదన్నారు. మసీదు ధ్వంసం తరువాతే తీవ్రవాదం పెరిగిందని, ఇస్లాం తీవ్రవాదానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. తమపట్ల ప్రభుత్వం మెతగ్గా ఉందని సీపీఎం సభ్యుడు నోముల నర్సింహయ్య అనటాన్ని ఆయన ఆక్షేపించారు.