భార్గవిని హత్య చేసి బుజ్జి ఆత్మహత్య
హైదరాబాద్: భార్గవిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రవీణ్ కుమార్ అలియాస్ బుజ్జి తన సూసైడ్ నోటులో రాశాడు. పోలీసులు ఆ సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. అష్టాచెమ్మా సినిమా విజయంతో తనను భార్గవి నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని అతను ఆ నోటులో రాశాడు. దాంతో తాను మనస్తాపానికి గురయ్యానని అతను రాశాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోటుతో పాటు మారణాయుధాన్ని, విషం సీసా, కూల్ డ్రింక్ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్గవిని బుజ్జి హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రవీణ్ కుమార్ సైనేడ్ సేవించినట్లు పోలీసులు చెబుతున్నారు.
భార్గవితో తనకు 2006లో పెళ్లయిందని, తామిద్దరు ఆటా కార్యక్రమంలో కలిసి పాల్గొన్నామని అతను ఆ నోటులో రాశాడు. కూల్ డ్రింకులో ప్రవీణ్ కుమార్ మత్తు మందు కలిపి ఇచ్చి ఆ తర్వాత హత్య చేసినట్లు భావిస్తున్నారు. భార్గవి మెడపై కత్తిగాట్లు ఉన్నాయి. శరీరంపై గాయాలున్నాయి. తాము ఏడాది క్రితం విడిపోయామని ప్రవీణ్ కుమార్ నోటులో రాశాడు. బుజ్జితో భార్గవి సంబంధాలు నచ్చలేదని అంటున్నారు. భార్గవి తల్లి అవమానించడం తాను భరించలేకపోయానని కూడా ప్రవీణ్ కుమార్ నోటులో రాశాడు.