సత్యంపై చర్య తీసుకుంటాం: సెబీ
ముంబై:సత్యంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ తాము పూర్తి స్ధాయిలో గమనిస్తున్నామనీ త్వరలోనే ఈ వ్యవహారంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సెబీ ఛైర్మన్ జి.బి.భావే ప్రకటించారు. అలాగే మదుపుదారులను ఆందోళనకు గురి చేస్తున్న ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వం, స్టాక్మార్కెట్వర్గాలు చర్చలు జరుపుతున్నాయని సెబీ ఆయన తెలిపారు. ఇక ఈ అంశంపై నాస్కామ్ స్పందిస్తూ... లిస్టెడ్ ఐటీ కంపెనీలపై దీని ప్రభావమేమీ ఉండదని చెప్పారు. మరో ప్రక్క సత్యం వల్ల మన ప్రతిష్టకేమీ భంగం కలగదు.. అని ఇన్ఫోసిస్ వర్గాలు చెపుతున్నాయి.
సత్యం వ్యవహారాల వల్ల దేశ ఐటీ కంపెనీల ప్రతిష్ఠకు వచ్చిన ముప్పేమీ లేదని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యాఖ్యానించింది. సత్యం కంపెనీలో తిరోగమన అడుగుల వల్ల భారత ఐటీ కంపెనీలపై అంతర్జాతీయంగా అపనమ్మకం ఏర్పడుతుందని వస్తున్న వార్తలను ఇన్ఫోసిస్ డైరక్టర్(హెచ్ఆర్) టీవీ మోహన్దాస్ పాయ్ కొట్టిపారేశారు. సత్యంలో వచ్చినవి కేవలం ఒడిదొడుకులనీ, మార్కెట్ ఉత్థాన దశకు వెళ్లినప్పుడు మదుపుదారులు ఈ అంశాలనేమీ పరిగణనలోకి తీసుకోరని ఆయన చెప్పారు.