'కేసినేని నాని చంద్రబాబు ఏజెంట్'
హైదరాబాద్: ప్రరాపా విజయవాడ కన్వీనర్ కేశినేని నాని ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆయన ఎవరి కోసమో కోవర్టు ఆపరేషను నిర్వహిస్తున్నట్లున్నారు అంటూ అనుమానం వెలిబుచ్చారు. షోకాజు నోటీసుకు సమాధానం ఇవ్వకుండా తెదేపా నేతలు హరికృష్ణ, బాలకృష్ణను కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బుధవారమిక్కడ ప్రరాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి పద్మతో కలిసి ఆయన మాట్లాడారు.
నాని ఆరోపణలు సరి కాదన్నారు. ''పదవి తీసుకున్నప్పుడు లేని కులాల ప్రస్తావన ఇప్పుడు చేయటం..గొడవ రాగానే కులం పేరు లేవనెత్తటం సరైంది కాదు. చిరంజీవి మనస్తత్వం, ఆలోచన అందరికీ తెలుసు. ప్రతి జిల్లాలోనూ అక్కడి సామాజిక వర్గాలన్నింటికీ ప్రాధాన్యమిచ్చాం. ఏ కమిటీపైనైనా చర్చకు సిద్ధం'' అని సవాలు విసిరారు. జిల్లా కన్వీనర్ విజయనిర్మలను దుర్భాషలాడటం, నిర్బంధించటం, ఆమె భర్త కృష్ణారావును కొట్టటం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. ఆయనకు ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వాలని సూచించారు.
అలా చేయకుండా విలేకరుల సమావేశం పెట్టటం ఏమిటన్నారు. అల్లు అరవింద్ అరాచక శక్తుల్ని ప్రోత్సహిస్తున్నారని నాని విమర్శించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా..''నేను మిమ్మల్ని అదే మాట అంటాను. అలా చేస్తే సరిపోతుందా? వంగవీటి రాధా అరాచకశక్తి అని నిరూపించగలరా? అలాగైతే ఆయన ఎన్నికల్లో ఎలా గెలుస్తారు. ప్రజలు పిచ్చోళ్లు కాదు'' అని పేర్కొన్నారు. ఆముదాలవలసలో చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు విసిరిన ఘటనను ప్రస్తావించగా..''అలా చేయటం తప్పు. నాకు చాలా బాధగా ఉంది'' అని అన్నారు.
హెరిటేజ్పై శ్వేతపత్రం విడుదల చేయాలి: హెరిటేజ్ వ్యవహారాలపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని తమ్మినేని సీతారాం డిమాండు చేశారు. ఆ సంస్థ ఆస్తులు, లావాదేవీలపై అనేక అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. హెరిటేజ్ ఆస్తుల్ని దాని అనుబంధ సంస్థ హెరిటేజ్ ఇన్ఫ్రాకి తరలించారని చెప్పారు. ''హెరిటేజ్ ఇన్ఫ్రాలో 49 శాతం వాటా ఎవరిదో చెప్పాలి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో లాభనష్టాలను భాగస్వాములకు తెలియజేయాలి.
కంపెనీపై వస్తున్న ఆరోపణలపై తప్పించుకుందామంటే కుదరదు. సెబీ ద్వారా విచారణ జరిపించాలి'' అని ప్రభుత్వాన్ని కోరారు. చిరంజీవి రక్తనిధి కేంద్రం సామాజిక సంస్థ అని, ఇందులో ఏమైనా అవకతవకలు ఉంటే ప్రభుత్వం విచారణ జరిపించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు కొనసాగుతుంటే ప్రభుత్వం మౌనంగా ఉండిపోతోందని ప్రరాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు.