తెలంగాణ కోరిక తీరుస్తాం: చిరు
నిజామాబాద్:తెలంగాణ ప్రజల కోరికకు తాము అనుకూలమని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చెప్పారు. నిజామాబాద్ జిల్లా బిక్కనూరు నుంచి కామారెడ్డి వరకు ఆయన ఆదివారం రోడ్ షో నిర్వహించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణకు అవసరమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై చిరంజీవి ధ్వజమెత్తారు.
ప్రజలు పడుతున్న కష్టాల్లో తాను తోడుంటానని ఆయన హామీఇచ్చారు. రాష్ట్ర ప్రజలు మాటను గౌరవించే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రాజకీయాల్ని అడ్డుపెట్టుకుని పదవులను అధిరోహించాలన్న ఆశ తనకు లేదని, రాజకీయ మంటే తనకు విలాసవస్తువుకాదని, రాజకీయ మంటే ప్రజలకు చేసుకునే సేవని ఆయన అన్నారు.
ప్రజలు నన్ను ఇప్పటికీ అభిమానిస్తున్నారు, అంతకన్నా ఎక్కువగా నమ్ముతున్నారు వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయనని ఆయన అన్నారు. ప్రజా సేవ చేయడంలోనే జీవితానికి అర్థం పరమార్థం ఉంటుందని ఆయన అన్నారు. బిక్కనూరులో గ్రామసేవకుల ధర్నా శిబిరాన్ని ఆయన సందర్శించారు. గ్రామసేవకులకు కనీస వేతనాలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు.