కాంగ్రెస్ పారిపోయింది: చంద్రబాబు
శాసనసభలో గవర్నర్ చేసిన ప్రసంగం పేలవంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో విధానం లేదని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలా ఉందని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో శాంతిభద్రతలను, అవినీతిని, అభివృద్ధిని ప్రస్తావించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షాలు నిలదీస్తాయనే భయంతో ప్రభుత్వం శాసనసభ సమావేశాలను నామమాత్రం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో ప్రజాసమస్యలు ప్రస్తావనకు రాకుండా ప్రభుత్వం అడ్డు పడుతోందని ఆయన అన్నారు. బిఎసి సమావేశం మొక్కుబడిగా సాగిందని ఆయన అన్నారు. ఈ విషయంలో స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి నిస్సహాయుడని ఆయన వ్యాఖ్యానించారు.
మరో శాసనమండలి సభ్యుడిని గెలిచే బలం ఉన్నా కాంగ్రెస్ ఆ సీటును తమకే వదిలిపెట్టిందని ఆయన అన్నారు. పోటీ చేసే సత్తాను కాంగ్రెస్ కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అభ్యర్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసే దుస్థితిలో కాంగ్రెస్ పడిందని ఆయన అన్నారు. పాత సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త పనులకు ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇస్తోందని, కమీషన్ల కోసమే ఈ పని చేస్తోందని ఆయన అన్నారు.