నలభైకి చేరిన హెపటైటిస్ మృతులు
గుజరాత్:గుజరాత్ లోని సబర్కంత జిల్లాలో హెపటైటిస్ మృతుల సంఖ్య ఆదివారం నాటికి 40కి పెరిగిందని తెలిసింది.అలాగే మరో వెయ్యిమంది వరకు హెపటైటిస్ వల్ల అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. దీంతో సబర్కంథ ప్రాంతవాసులు విపరీతమైన భయాందోళనకు గురవుతున్నారు. కలుషితమైన సిరంజిలు వాడడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తుండడంతో... అందుకు కారణమైన వైద్యులపై గుజరాత్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు డాక్టర్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం మరో వైద్యున్ని అరెస్టు చేశారు. మరోవైపు.. హెపటైటిస్ వ్యాపిస్తుండడంతో కేంద్రానికి చెందిన నాలుగు వైద్య బృందాలు గుజరాత్లోని సబర్కంథ్ జిల్లాకు చేరుకుని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఆస్పత్రుల్లో ఉండే ఉద్యోగులకు హెపటైటిస్ వైరస్ సోకకుండా టీకాలు వేశారు.
ఈ విషయమై జిల్లా వైద్యాధికారులు మాట్లాడుతూ... హెపటైటిస్-డి కారణంగా ఆదివారం ఇద్దరు మరణించారని, మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరరంగా వారు ఉందని తెలిపారు. అదేసమయంలో.. కలుషిత ఇంజక్షన్లు వాడి హెపటైటిస్ వ్యాప్తికి దోహదమైన ఏడుగురు వైద్యుల గుర్తింపును రద్దు చేయాల్సిందిగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను కోరింది.