9న 'మహా'గర్జన
హైదరాబాద్: వచ్చే తొమ్మిదో తేదీన హైదరాబాద్లో 'మహా'బహిరంగ సభను నిర్వహించాలని మహాకూటమి నేతలు నిర్ణయించారు. శనివారంనాడు హైదరాబాద్లో నిర్వహించిన సోనియా బహిరంగ సభ పేలవంగా ఉందని అభిప్రాయపడిన కూటమి నేతలు.. 'మహా' గర్జన మాత్రం కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని తీర్మానించారు. సోనియాగాంధీ సభ జరిగిన పెరేడ్గ్రౌండ్స్లో ఈ సభ నిర్వహణ అనవసరమని భావించిన నేతలు.. ఇందుకోసం హైదరాబాద్ చుట్టుపక్కల జాతీయ రహదారుల పక్కన విశాలమైన స్థలం కోసం ఆదివారం వేట మొదలు పెట్టాలని నేతలు భావించారు.
ఇక ఈ సభను చూసినవారు వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి వస్తుందని తీర్మానించుకునేలా నాలుగు పార్టీల కేడర్ శక్తివంచన లేకుండా కృషి చేయాలని నిశ్చయించినట్లు సమాచారం. సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బీవీ రాఘవులు, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు శనివారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసానికి వచ్చి సుమారు రెండున్నర గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు.అలాగే ఈ సమావేంలో చిరంజీవి బాగా బలహీనపడ్డారని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు. మార్పు అన్న పదం తప్ప ఏ విషయంలోనూ స్పష్టత లేని చిరంజీవి పార్టీపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరంలేదని, వైఎస్నే లక్ష్యంగా చేసుకొని పని చేయాలని కూటమి నేతలు భావించారని సమాచారం.