ఇక బ్యాలెట్ పోరులో కూర రాజన్న
వరంగల్: వరంగల్ కేంద్ర కారాగారంలో ఉన్న జనశక్తి అగ్రనేత కూర రాజన్నకు బెయిల్ మంజూరైంది. వివిధ కేసుల్లో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలు తమకు అందలేదని జైలు అధికారులంటున్నారు. దీంతో కూర రాజన్న విడుదలలో జాప్యం జరుగింది. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలు అందడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో జనశక్తికి తగిన బలం ఉంది. గతంలో రాజన్న నాయకత్వంలోని నక్సలైట్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎన్ వి కృష్ణయ్య విజయం సాధించారు. కూర రాజన్న సిరిసిల్ల నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. రాజన్నపై కరీంనగర్ జిల్లాలోనే 11 కేసులు నమోదయ్యాయి. వీటిలో 9 కేసులను కోర్టు కొట్టేసింది.
కూర రాజన్న కరీంనగర్ జిల్లా వేములవాడ. పదో తరగతి వరకు వేములవాడలో చదివిన రాజన్న ఆ తర్వాత హైదరాబాదులో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆ సమయంలో ఆయన విప్లవ విద్యార్థి సంఘం పిడిఎస్ యులో పనిచేసి ఆ తర్వాత పార్టీలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతవాసం మొదలైంది. ఆ మధ్య కాలంలో పోలీసులు ఆయనను ఉత్తరప్రదేశ్ లో అరెస్టు చేశారు. ఆయన సోదరుడు అమర్ కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. వీరిద్దరూ జనశక్తిని ముందుండి నడిపించారు. కూరా రాజన్న అరెస్టు అనంతరం పోలీసులు అమర్ ను కూడా అరెస్టు చేయగలిగారు.












Click it and Unblock the Notifications