క్యాన్సర్ బాధితులకు షాక్! మార్కెట్లో కీమోథెరపీ మందుల కొరత
క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న వేలాది మంది రోగుల ప్రాణాలు ఇప్పుడు మరింత ప్రమాదంలో పడ్డాయి. దేశవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సకు అత్యంత కీలకమైన, ప్రాణరక్షక కీమోథెరపీ మందుల కొరత తీవ్ర కొరత ఏర్పడింది. గత రెండు వారాలుగా మార్కెట్లో 'సిస్ప్లాటిన్’ (Cisplatin), 'కార్బోప్లాటిన్’ (Carboplatin) వంటి ముఖ్యమైన ఔషధాల జాడ పూర్తిగా కనిపించకపోవడం వైద్య రంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న మందులు హఠాత్తుగా ఎందుకు మాయమయ్యాయి? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ సంక్షోభం ఏంటి? రోగుల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ సరఫరా నిలిచిపోవడానికి దారితీసిన నమ్మలేని నిజాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
మెడికల్ షాపులు ఖాళీ.. చికిత్సకు బ్రేక్!
క్యాన్సర్ గడ్డలను కరిగించే కీమోథెరపీ ప్రక్రియలో ఈ ప్లాటినం ఆధారిత మందులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే, గత రెండు వారాలుగా దేశంలోని ప్రముఖ ఆసుపత్రులు, హోల్సేల్ డీలర్లు, మెడికల్ స్టోర్ల వద్ద వీటి నిల్వలు పూర్తిగా కరువయ్యాయి. సాధారణంగా రోగులకు ఎక్కువగా వాడే తక్కువ మోతాదు (Low dose) గల మందులు మార్కెట్ నుంచి పూర్తిగా అదృశ్యమవ్వగా, అత్యధిక మోతాదు గల ఔషధాలు మాత్రం ఎక్కడో ఒకచోట మాత్రమే లభిస్తున్నాయి. ఫలితంగా, రోగులకు సకాలంలో కీమోథెరపీ అందించలేక, చికిత్స మధ్యలోనే ఆగిపోతోందని దేశంలోని ప్రముఖ ఆంకాలజిస్టులు (క్యాన్సర్ నిపుణులు) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆకాశాన్నంటిన ధరలు!
లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చి సెంటర్కు చెందిన ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ మీనన్ ఈ సంక్షోభం వెనుక ఉన్న అసలు కారణాన్ని విశ్లేషించారు. ఈ కీమోథెరపీ మందుల తయారీకి ప్లాటినం అనే అత్యంత విలువైన లోహం ముడిపదార్థంగా అవసరమవుతుంది. "2023 మధ్యలో అంతర్జాతీయ మార్కెట్లో ఒక గ్రాము ప్లాటినం ధర కేవలం రూ. 2,700 ఉండేది, కానీ ఇప్పుడు అది ఏకంగా రూ. 7,800కు చేరుకుంది" అని ఆయన వెల్లడించారు. అంటే ముడిపదార్థాల ధరలు దాదాపు మూడు రెట్లు పెరగడమే ఈ భారీ కొరతకు ప్రధాన కారణం.
ప్రభుత్వ నిబంధనల ఉచ్చు.. చేతులెత్తేస్తున్న కంపెనీలు!
అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్, ప్లాటినం ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, భారతదేశంలో ఈ మందులను తయారు చేసే కంపెనీలు మాత్రం పైసా కూడా ధర పెంచే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఈ ప్రాణరక్షక ఔషధాలన్నీ ప్రభుత్వ 'డ్రగ్ ప్రైసింగ్ కంట్రోల్ ఆర్డర్’ (DPCO) పరిధిలోకి వస్తాయి. ఈ కఠినమైన నిబంధనల ప్రకారం, అత్యవసర ఔషధాల ధరలను కంపెనీలు తమ ఇష్టానుసారం పెంచడానికి వీలుండదు. ఏటా ప్రభుత్వ హోల్సేల్ ధరల సూచీ (WPI) పెంపునకు అనుగుణంగా మాత్రమే స్వల్ప సవరణ సాధ్యమవుతుంది. అటు ముడిపదార్థాల ధరలు పెరిగిపోవడం, ఇటు అమ్మే ధర పెంచే అవకాశం లేకపోవడంతో ఫార్మా కంపెనీలు వీటి ఉత్పత్తిని నిలిపివేసే పరిస్థితికి వచ్చాయి.
పశ్చిమ ఆసియా సంక్షోభం.. ప్లాటినం కొరతకు అంతర్జాతీయ లింక్!
భారతదేశంలో క్యాన్సర్ మందుల కొరతకు, సుదూర దేశాల్లో జరుగుతున్న పరిణామాలకు బలమైన లింక్ ఉంది. ప్లాటినం సరఫరాలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న దక్షిణాఫ్రికాలో మైనింగ్ లోపాలు తలెత్తడం, దానికి తోడు ఆటోమొబైల్ రంగం, గ్రీన్ హైడ్రోజన్ తయారీలో ప్లాటినం వినియోగం విపరీతంగా పెరగడం వల్ల అంతర్జాతీయంగా దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వీటన్నింటికీ తోడు పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) లో నెలకొన్న ప్రస్తుత యుద్ధ వాతావరణం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. భారతదేశానికి అవసరమైన ప్లాటినం దిగుమతులలో దాదాపు సగం (50%) వాటా ఒక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచే జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న రవాణా అంతరాయాలు భారత మార్కెట్ను తీవ్రంగా దెబ్బతీశాయి.
ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, ధరల నియంత్రణ నిబంధనలపై ప్రత్యేక నిర్ణయం తీసుకోకపోతే, ఈ క్యాన్సర్ మందుల కొరత మరింత తీవ్రమై వేలాది మంది అమాయక రోగుల ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications