కాపులకు అన్యాయం: కాపునాడు
హైదరాబాద్: సామాజిక న్యాయం పేరుతో సీట్ల కేటాయింపులో రాజకీయపార్టీలు కాపులకు అన్యాయం చేశాయని కాపునాడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పీఎల్ నర్సింహరావు ఆరోపించారు. పీఆర్పీ కూడా తమకు సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోఆయన విలేఖరులతో మాట్లాడారు.
పీఆర్పీ ఏర్పాటుతో ఈ సారి కాంగ్రెస్, టీడీపీలు కూడా కాపులకు ప్రాతినిధ్యాన్ని బాగా తగ్గించాయని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. "2004 ఎన్నికల్లో కాపులకు కాంగ్రెస్ పార్టీ 44 అసెంబ్లీ స్థానాలు, టీడీపీ 25 స్థానాలు కేటాయించాయి. ఈ సారి కాంగ్రెస్ 15, టీడీపీ 9 సీట్లను మాత్రమే కేటాయించాయి. అటు పీఆర్పీ కూడా కాపులకు న్యాయం చేయలేదు. కనీసం 60 స్థానాలైనా ఇస్తారనుకున్నాం. తీరా ఇప్పుడు 25 స్థానాలకు మించి దక్కేట్టు కన్పించడం లేదు" అని నర్సింహరావు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్పీకి ఓట్లేయని కమ్మ వర్గానికి ఎక్కువ సీట్లిచ్చారని ఆరోపించారు. కాపులకు న్యాయం చేయాలని..జనాభాకు తగ్గట్టు తమకు ప్రాతినిధ్యం కల్పించాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో 3.6 కోట్ల జనాభా ఉన్న కాపులకు కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు మాత్రమే ఇచ్చి మోసం చేసిందని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు వీపీ నారాయణ స్వామి రాయల్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మంగళవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.