మీరట్: ఎన్నికల ప్రచారంలో భాజపాకు మరో ఆయుధం దొరికింది. చేయని తప్పుకు మాయావతి సర్కారు తనను జాతీయ భద్రతా చట్టం కింద జైల్లోపెట్టి, సొరకాయ కూరతో చిప్పకూడు తినిపిస్తే, ముంబయిలో నెత్తుటేరులు పారించిన పాకిస్థానీ ఉగ్రవాది అజ్మల్ అమిర్ కసబ్ను మహారాష్ట్ర ప్రభుత్వం తందూరీ చికెన్లతో ముద్దు చేస్తోందని భాజపా యువనేత వరుణ్ గాంధీ మండిపడ్డారు. బుధవారం ఇక్కడ ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. "మనదేశంలో వరుణ్ గాంధీని నాసా కింద ఎటావా జైల్లోపెట్టి సొరకాయ కూడు తినిపిస్తారు. కసబ్కు తందూరీ చికెన్లతో విందుచేస్తారు" అన్నారు. అయితే, "నాకు సొరకాయ ఇష్టం. నేను శాఖాహారిని" అని చెప్పారు. మాయావతి ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని చెప్పడానికే ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముంబయి ఉగ్రవాద దాడితో మొత్తం దేశాన్నే అల్లకల్లోలం చేయబూనిన కసబ్పై కేవలం ఐపీసీ సెక్షన్ల కింద కేసుపెట్టగా, మతోద్రేక వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న వరుణ్పై కఠినమైన నాసాను ప్రయోగించిన తీరును ఎత్తిచూపడం ఆయన లక్ష్యం. ప్రస్తుతం కాంగ్రెస్ అంతిమ శ్వాస తీసుకుంటోందని, ఈ దశలోఅది తన వ్యాఖ్యలపై స్పందించే స్థితిలో ఉండదని ఎద్దేవా చేశారు. చావుముఖంలో ఉన్న వారి గురించి చెడుగా మాట్లాడకూడదని తన తల్లి నేర్పించిందని అన్నారు.