టెక్కీకి ఆస్పత్రిని ఊడ్చే శిక్ష
హైదరాబాద్: ఇద్దరు స్త్రీలను వేధించిన టెక్కీకి రాష్ట్ర హైకోర్టు వినూత్నమైన శిక్ష విధించింది. నెలపాటు ఆ యువ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆస్పత్రి ఆవరణను ఊడ్చి శుభ్రం చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. డెల్ కంప్యూటర్స్ లో పని చేస్తున్న 21 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎం. దినేష్ కుమార్ కు ఆ శిక్ష విధిస్తూ జస్టిస్ బి చంద్రకుమార్ ఆదేశాలు జారీ చేశారు.
పోలీసుల ముందు లొంగిపోవాల్సిందిగా కోర్టు దినేష్ కుమార్ ను ఆదేశించింది. గాంధీ అస్పత్రి ఆవరణలో రోజుకు గంటపాటు ఊడ్చాలని ఆదేశించింది. తన సౌకర్యాన్ని బట్టి ఆస్పత్రిని ఊడ్చే సమయాన్ని ఎంచుకునేందుకు కోర్టు అతనికి అవకాశం ఇచ్చింది. దినేష్ కుమార్ వచ్చాడా, లేదా నమోదు చేయడానికి రిజిష్టర్ పెట్టాలని హైకోర్టు గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ ను ఆదేశించింది. మల్కాజిగిరిలో మోటార్ సైకిల్ పై వెళ్తూ మార్చి 21వ తేదీన దినేష్ కుమార్, అతని మిత్రుడు బాలరంగశాయి ఇద్దరు మహిళల దుపట్టాలు లాగారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వారిద్దరిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. వెంకటకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. బెయిల్ కోసం దినేష్ కుమార్ పెట్టుకున్న పిటిషన్ ను జిల్లా కోర్టు తిరస్కరించింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినూత్నమైన శిక్ష విధించింది.