కాంగ్రెస్ తో జేపీ కుమ్మక్కు: టీడీపీ
హైదరాబాద్: తెలుగుదేశం కంటే కాంగ్రెస్ మెరుగని సర్టిఫికెట్లు ఇవ్వడం ద్వారా ఆ పార్టీతో జయప్రకాష్ నారాయణ కుమ్ముక్కు అప్పుడే మొదలైందని...ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాగే ఆ పార్టీ ఎలా మెరుగో నిరూపించడానికి ఆయన బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. మాటల్లో నిరంతరం నీతి సూత్రాలు వల్లించే లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఆచరణలో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ విషయమై ఆయన టీడీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అలాగే 'ధన రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పే జయప్రకాష్ కార్పొరేట్ విద్యాసంస్థ అధిపతిగా ఉన్న లావు రత్తయ్యలో ఏ సత్తా చూసి మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా నిలిపింది? విద్యారంగం కార్పొరేట్పరం కావడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారని...ఈ పరిస్థితులపై తాను పోరాడతానని ప్రకటించిన జేపీ ఇప్పుడాపని చేయగలరా' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమంటూ అవే రాజకీయాలను ప్రోత్సహించే కాంగ్రెస్ ప్రభుత్వంలో జాతీయ సలహామండలి సభ్యునిగా పనిచేశారని విమర్శించారు.