కూటమే కూల్చింది: టిడిపి
హైదరాబాద్: మహాకూటమి ఏర్పాటైన తర్వాత దాన్ని సరిగా ముందుకు తీసుకొని వెళ్లలేకపోయామని, ఆ ప్రభావం ఎన్నికల మీద పడిందని తెదేపా వర్క్షాప్ అభిప్రాయపడింది. సీట్ల సర్దుబాటులో ఆలస్యం కావడంతో అభ్యర్థుల ఎంపికలో జాప్యం జరిగిందని, ఇది కూడా ఓటమికి కారణమని అంచనాకు వచ్చింది. బిజెపిపై వ్యతిరేకతతో మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గడం, బీసీలు కొంత దూరమవడం ఓ కారణమని పేర్కొంది. తెరాసతో పొత్తుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వ్యతిరేకత వ్యక్తమవడం, ప్రజారాజ్యం, లోక్ సత్తా పార్టీలు ఓట్లనుచీల్చడంతో కాంగ్రెస్కు లబ్ధి చేకూరిందని వివరించింది. ఇవన్నీ పార్టీ ఓటమికి కారణాలని విశ్లేషించింది.
కాంగ్రెస్, తెదేపా పోటీ చేసిన స్థానాల్లో ఇరు పార్టీల మధ్య అసెంబ్లీ ఓట్ల తేడా ఒక శాతమేనని, లోక్సభకు వచ్చేసరికి 4 శాతం తేడా ఉందని పేర్కొంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బిజెపిపైవ్యతిరేకతతో ఓటర్లు కాంగ్రెస్వైపు మొగ్గు చూపినట్లు వివరించింది. దీని ప్రభావం అసెంబ్లీపై కూడా పడిందని అభిప్రాయపడింది. ఈ అంశాల వల్లే దాదాపు 40 అసెంబ్లీ స్థానాల్లో కేవలం వెయ్యి, రెండు వేల లోపు ఓట్లతోనే ఓటమి పాలయ్యామని విశ్లేషించింది.