రాఖీ స్వయంవరం నేటి నుంచే
ప్రతీవారం వరులు తమ వ్యక్తిత్వం, స్వభావం, శారీరక దృఢత్వం, తెలివి తదితర అంశాలను ప్రదర్శిస్తూ రాఖీపై ప్రేమను ఒలకబోయాలి. ఈ ప్రయాణంలో చివరగా రాఖీ ఓ అదృష్టవంతుడితో భారీ వేడుకలో తాళి కట్టించుకొంటుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఇప్పటికే 16 మంది వరులు స్వయంవరానికి సిద్ధమయ్యారు. డ్యాన్స్ షోలతో గుర్తింపు పొందిన రామ్ కపూర్ ఈ 'స్వయంవరం' షోను నిర్వహించనున్నారు. రాఖీ స్నేహితులు షోకి హాజరై సరైన నిర్ణయం తీసుకోవడంలో ఆమెకు సహకరిస్తారు. ఈ కొత్త ప్రయాణం విషయమై రాఖీ మాట్లాడుతూ 'నాకు చాలా భయంగా ఉంది. అదే సమయంలో ఉత్సుకతగా ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. నా జీవిత భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎన్నుకోగలనన్న నమ్మకం ఉంది. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ దశలో స్నేహితుడు రామ్, ఇతర శ్రేయోభిలాషుల సహాయాన్ని ఉపయోగించుకొంటాను' అని చెప్పారు. షో జరిగే ఉదయ్పూర్, ఫతేగఢ్ రాజభవనాల గురించి మాట్లాడుతూ అద్భుతమైన, అందమైన ప్రాంతాలని అభివర్ణించారు. తన స్వయంవరానికి ఇంతకంటే మంచి ప్రాంతాలను ఊహించలేకపోతున్నానని చెప్పారు. 'అందరు వరులతో కొద్దిసేపు మాట్లాడాను. అందరూ బాగున్నారు. అయితే తుది విజేత ఎవరనేది ఇప్పుడే చెప్పలేను' అని రాఖీ పేర్కొన్నారు.