కేంద్ర మంత్రి ఒత్తిడి పెట్టాడు: జడ్జి
చెన్నై: ఓ కేంద్ర మంత్రి ఒక వైద్యుడి కుమారుడి ఫోర్జరీ మార్కు షీట్ల కేసులో బెయిల్ మంజూరు చేయాలని తనపై ఒత్తిడి తెచ్చాడని, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వారే న్యాయమూర్తులను ఒత్తిడి చేస్తూ అధర్మానికి పాల్పడుతున్నారని చెన్నై హైకోర్టు జస్టిస్ రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరిలో ఓ డాక్టర్ మెడిసిన్ చదువుతున్న తన కుమారుడికోసం యూనివర్శిటీ సిబ్బందికి లంచం ఇచ్చి ఫోర్జరీ మార్కుల జాబితాను తయారుచేశారని సీబీఐ కేసు నమోదుచేసింది. దీంతో నిందితులు యాంటిసిపేటరీ బెయిలుకోసం దరఖాస్తు చేశారు.
ఆ కేసు విచారణ సందర్భంగా తాను ఈకేసును ఈనెల 15నే తిరస్కరించానని ఇప్పుడు కూడా వారికి అనుకూలంగా వచ్చే అవకాశం లేదని అన్నారు. దీంతో వారి తరపు లాయర్ మాట్లాడుతూ జడ్జి కేవలం ప్రభుత్వ తరపు లాయరు వాదన మాత్రమే విని తీర్పు ఇవ్వటం సరికాదన్నారు. దీంతో ఆగ్రహించిన జడ్జి ఏ కేసులో ఎలా తీర్పు ఇవ్వాలో తనకు తెలుసని అంటూ ఈ కేసులో నిందితులు సరైన వ్యక్తులు కారని, ఈ కేసులో తమకు అనుకూలంగా వ్యవహరించాలని కోరుతూ ఓ కేంద్ర మంత్రితో ఒత్తిడి తెచ్చారని అన్నారు. కేంద్రమంత్రులే ధర్మం తప్పి ప్రవర్తిస్తే న్యాయం ఎలా నిలబడుతుందని అన్నారు. అయితే ఆ మంత్రి పేరు చెప్పేందుకు జడ్జి నిరాకరించారు.