వైయస్ ను కలిసిన సాయిరాం
హైదరాబాద్: ఎంసెట్ మెడిసిన్ లో 9వ ర్యాంకు సాధించిన సాయిరాం మంగళవారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ అతను ముఖ్యమంత్రికి ఒక వినతిపత్రం సమర్పించాడు. మెడిసిన్ లో చేరేందుకు వయోపరిమితి సరిపోదని సాయిరాంకు సోమవారం అధికారులు కౌన్సెలింగులో అడ్మిషన్ నిరాకరించిన విషయం తెలిసిందే.
మెడిసిన్ లో చేరడానికి ప్రతిపాదిత తేదీ నాటికి విద్యార్థికి 17 ఏళ్ల వయస్సు దాటి ఉండాలని భారత వైద్య మండలి నిబంధన. అయితే 17 ఏళ్లు పూర్తి కావడానికి సాయిరాంకు 15 రోజులు తక్కువయ్యాయి. దీంతో సాయిరాం ఇంతకు ముందు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. అతని ప్రవేశాన్ని ప్ర్తత్యేక కేసుగా పరిగణించి వయసు నిబంధనను సడలిస్తూ ఉన్నత విద్యాశాఖ ఈ నెల 18వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉస్మానియాలో సోమవారం జరిగిన కౌన్సెలింగ్ లో అతనికి అధికారులు అడ్మిషన్ నిరాకరించారు. ఈ స్థితిలో తనకు న్యాయం చేయాలని సాయిరాం ముఖ్యమంత్రిని కోరాడు.