న్యూఢిల్లీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో తాను టికెట్లు అమ్ముకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని జార్ఖండ్ ఎన్నికల ఇంచార్జీగా వ్యవహరిస్తున్న కాంగ్రెసు సీనియర్ నాయకుడు కె. కేశవరావు అన్నారు. జార్ఖండ్ ఎన్నికల్లో కేశవరావు పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు మారెప్ప ఆరోపించారు. మీడియాపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు దక్కని ఆశావహులు డబ్బులు అడిగానని ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు. తన వివరణ లేకుండా వార్తలు ప్రచారం చేసి మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందని ఆయన మండిపడ్డారు.
కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తనపై ఆరోపణలు చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.