సోనియా నిర్ణయం శిరోధార్యం: మంత్రులు
తెలంగాణపై కాంగ్రెసు నాయకులు మాట్లాడకపోవడమే మంచిదని మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అంశం సోనియా వద్ద ఉన్నందున తాము చేసేదేమీ లేదని మంత్రివర్గం అభిప్రాయపడినట్లు సమాచారం. కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి మంత్రులు తప్పు పట్టారు. పోలీసుల అత్యుత్సాహం వల్ల సమస్య ఉత్పన్నమైందని వారన్నారు. పోలీసు అత్యుత్సాహానికి తాము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారన్నారు. ఉస్మానియా వంటి సున్నితమైన ప్రదేశాల్లో సంయమనం పాటించే పోలీసు అధికారులను నియమించాలని వారు కోరారు.
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ విద్యార్థులకు సమన్లు జారీ చేసింది. శాంతియుతంగా ఆందోళన సాగించాలని మానవ హక్కుల కమిషన్ విద్యార్థులను ఆదేశించింది. పోలీసులే అత్యుత్సాహం ప్రదర్శించిందని విద్యార్థులు మానవ హక్కుల కమిషన్ కు వివరించారు. తమపై దాడి చేసిన పోలీసులను గుర్తించి వారిపై కేసులు పెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. డిసిపి స్టీఫెన్ రవీంద్రను సస్పెండ్ చేయాలని వారు కోరారు. పోలీసు దాడిలో గాయపడిన విద్యార్థులు తమ వాదనను మానవ హక్కుల కమిషన్ ముందు తమ వాదనను వినిపించారు.