తెలంగాణ కోసం త్యాగం చేసిన డిఎస్పీ నళిని కథ
ప్రత్యేక తెలంగాణ సాధన కోసం వివిధ వర్గాల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన నళిని మెట్టినిల్లు వరంగల్ జిల్లా. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నళినికి జిల్లాలోని ఆత్మకూరు మండలం ఉల్లిగడ్డ దామెరకు చెందిన నరేందర్తో వివాహం జరిగింది. నరేందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కాగా, ఈయన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు వద్ద ప్రస్తుతం పీఏగా పనిచేస్తున్నారు. ఎంకాం, బీఈడీ, పీజీడీసీఏ, డిప్లొమా ఇన్ ఫార్మసీ పూర్తి చేసిన నళిని 2006లో పరకాలలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగం పొందారు. అనంతరం 2007 గ్రూప్-1 ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యారు.
అప్పాలో శిక్షణ పొందిన నళిని కొద్దిరోజులు మామునూరు ఫోర్త్ బెటాలియన్లో శిక్షణ పొందారు. నళిని డీఎస్పీగా హన్మకొండ, హసన్పర్తి పోలీస్ స్టేషన్లలో మూడు వారాలపాటు ప్రొబేషనరీ విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆమెను కరీంనగర్ డీఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కొద్ది రోజులకే నళిని మెదక్ డీఎస్పీగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం మెదక్ డీఎస్పీగా కొనసాగుతున్న ఆమె తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ, పోలీసు శాఖలో ఆంధ్ర అధికారుల నిరంకుశ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ సంచలనం సృష్టించారు.
డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికిన నళిని నిర్ణయం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె రాజీనామా ప్రకటన మీడియాలో రావడంతో కేయూలో దీక్ష చేస్తున్న విద్యార్థులు, జేఏసీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఆమె జిల్లాకు వస్తే అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానిస్తామని జేఏసీ, వివిధ సంఘాల నేతలు ప్రకటించారు.
పోలీసు శాఖలో ఆంధ్ర అధికారుల అరాచకాలను నిరసిస్తూ డీఎస్పీ ఉద్యోగానికి నళిని రాజీనామా చేయడంతో జిల్లా మేరు సంఘం హర్షం వ్యక్తం చేసింది. రాజీనామా చేసిన నళిని మేరు కులస్తురాలు కావడంతో గర్వపడుతున్నామని సంఘం జిల్లా అధ్యక్షుడు బోల కొండ రవితేజ, పట్టణ అధ్యక్షుడు ఒడ్డెపల్లి వేణుగోపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.