ఐటి, సినీ రంగాలు బాగానే ఉన్నై: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయ్యే వరకు తెలంగాణ మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకోబోమని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేతపై రోశయ్య స్పందించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో పెట్టిన కేసుల కన్నా తెలంగాణ ఉద్యమకారులపై ఎక్కువ కేసులు పెట్టారని ఆయన అన్నారు. రోశయ్య ఆంధ్ర ప్రాంతానికే ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆందోళనల వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయనే మాటలో వాస్తవం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రకటనకు కట్టుబడి ముఖ్యమంత్రి రోశయ్య చొరవ తీసుకుని సీమాంధ్ర నాయకులను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించాల్సిన బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు.
అన్ని రాజకీయ పార్టీల గుట్టు బయటపడబోతున్నాయని, రెండు పడవలపై కాలు పెట్టిన తెలుగుదేశం పార్టీ బండారం బయట పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించామని కాంగ్రెసుకు చెందిన యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పారని, కాంగ్రెసు పార్టీ వైఖరి ఆ విధంగా స్పష్టమైందని, అందువల్ల కాంగ్రెసు పార్టీ వైఖరి గురించి కొత్తగా అడగాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సిఎల్పీ సమావేశం కూడా తెలంగాణకు ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని ఆయన చెప్పారు. సిఎల్పీ నిర్ణయానికి వ్యతిరేకంగా శాసనసభ్యులు వ్యవహరించడం సరి కాదని ఆయన అన్నారు. చంద్రబాబును విమర్శిస్తూ సిఎల్పీ నిర్ణయానికి కట్టుబడిన కాంగ్రెసు శాసనసభ్యులపై ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.