నోరు జారినందుకు లగడపాటి, మధు యాష్కీలకూ నోటీసులు
పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి వీరప్ప మొయిలీల ఆమోదంతో పార్టీ ప్రతినిధి జనార్థన్ ద్వివేది ఎంపీలిద్దరికీ నోటీసులు ఇచ్చారు. నోటీసులకు 15 రోజుల్లోగా వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రాజగోపాల్, మధుయాస్కీలు పార్టీ ఆసక్తులకు భిన్నంగా వ్యవహరించారని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ప్రజలకు సంబంధించిన సున్నితమైన అంశాలపై వీళ్లు చిత్తంవచ్చినట్లుగా మీడియాకెక్కడాన్నీ, పరోక్షంగా మీడియాను ప్రభావితం చేయడాన్నీ ఏఐసీసీ తీవ్రంగా తప్పు పట్టింది.
తెలంగాణను వ్యతిరేకిస్తూ ఒకరు, సమర్థిస్తూ మరొకరు.. క్రియాశీల పాత్ర పోషించడంపై ఏఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అధిష్ఠానం వద్దని ఓవైపు వారిస్తున్నా నేతలు... మీడియా వద్దకు పరుగులు తీసిన వైనం ఓ దశలో అధిష్ఠానాన్ని బాగా చికాకు పెట్టిందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మీడియాలో ఈ ఇద్దరు ఎంపీలు చేసిన ప్రసంగాల పూర్తి వివరాలను అధిష్ఠానం తెప్పించుకుందని పరిశీలించింది. వారేం మాట్లాడారనే దానికంటే కూడా తరచూ మీడియా దగ్గరకు పరుగులు తీయడం కచ్ఛితంగా క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.