24 గంటల తెలంగాణ బంద్ కు మద్దతు: జెఎసి
ప్రజా ప్రతినిధులు రాజీనామాల సమర్పణకు ఈ నెల 28వ తేదీ వరకు ఆగాల్సిన అవసరం లేదని, రేపటి నుంచే వరుసగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు సమర్పిస్తూ వెళ్లాలనే అభిప్రాయం జెఎసిలో వ్యక్తమైంది. రెండు, మూడు రోజుల్లో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. కాగా, ఈ నెల 23వ తేదీన తెలంగాణపై అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెసు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. జెఎసి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు కూడా పాల్గొన్నారు.
తెలంగాణ శాసనసభ్యులు వచ్చి రాజీనామాలపై హామీ ఇచ్చే వరకు వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని కదలనివ్వబోమని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పట్టుబట్టి కూర్చున్నారు. దీంతో కెసిఆర్, నాగం జనార్దన్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లారు. దామోదర్ రెడ్డిని విద్యార్థులు ఘెరావ్ చేశారు. విద్యార్థులకు నచ్చజెప్పేందుకు వారు ప్రయత్నించారు. కాగా, భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పనకు మంగళవారం హైదరాబాదులో జరగాల్సిన సీమాంధ్ర శాసనసభ్యులు, ఎమ్మెల్సీల సమావేశం వాయిదా పడింది. వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య నేపథ్యంలో వారు ఈ సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు.