అనుమానమొస్తే ఆగేది లేదు: చంద్రశేఖరరావు
మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి జీవిత చరిత్ర ఆంగ్ల అనువాద పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారమిక్కడ ఏవీ కళాశాలలో జరిగింది. దీనికి హాజరైన కేసీఆర్ మాట్లాడుతూ పార్టీలు, కొందరు నేతల వైఖరి చూస్తుంటే.. ఇంత మోసమా.. ఇంత దగానా అని అనిపిస్తోందన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల్లో తేడాలుంటే రాజీనామాలు చేయాల్సిందేనని, ఒకవేళ రాజీనామా చేయకపోతే ప్రజలే చూసుకుంటారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించినది కాదని అణువంత అనుమానం కలిగినా తక్షణం రాజీనామా చేద్దామన్నారు. కాలపరిమితితో.. తెలంగాణ ఏర్పాటు దిశగానే కమిటీ ఉంటుందని ఆశిద్దామని, కమిటీ విధివిధానాల్ని పరిశీలించిన తర్వాత అది కేవలం కాలయాపనకు పనిచేసే కమిటీ అని తేలితే తానే మొదట రాజీనామా చేస్తానని స్పష్టంచేశారు. హైదరాబాద్ను తామే అభివృద్ది చేసినట్లు సీమాంధ్రకు చెందిన కొందరు వింతవాదన చేస్తున్నారని, భౌగోళిక విస్తరణ అభివృద్ధి కాదన్నారు. హైదరాబాద్పై చేస్తున్న వితండవాదన పక్కనపెట్టాలని, ఒకవేళ దీన్ని అలాగే కొనసాగిస్తే తాము కూడా విశాఖపట్నం, తిరుపతిలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని కోరతామని చెప్పారు.