శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల ప్రకటనలో జాప్యం
కాగా, జస్టిస్ శ్రీకృష్ణ కమిటి విధివిధానాలు ఖరారయ్యాయి. రాష్ట్రపరిస్థితిపై సంప్రదింపుల కమిటి విధివిధానాలపై సోమవారం నాడు హోం మంత్రి చిదంబరం ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమై తుది కసరత్తు జరిపారు. సమావేశానంతరం హోం శాఖ కార్యదర్శి పిళ్ళై విలేఖర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కమిటి విధివిధానాలు ఖారరయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే కాంగ్రెస్ కోర్కమిటి సమావేశం తర్వాత ప్రకటన ఉండవచ్చని ఆయన చెప్పారు. కమిటి కాలపరిమితిని ఏడాదిలోపు ఉండవచ్చునని సూచనప్రాయంగా తెలిపారు. కాలపరిమితి ఏడాదిలోపేనని నిర్దేశించినా, కమిటి విచారణకు సమయం సరిపోకపోతే పొడిగింపు ఉండవచ్చునని ఆయన తెలిపారు. మొత్తానికి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన వస్తుందని హోం శాఖ కార్యదర్శి పిళ్ళై వివరించారు.
విధివిధానాలు ఖరారయ్యాయని తెలిసి ఆంధ్రప్రదేశ్ నాయకులు వాటిపై ఆరా తీయడం ప్రారంభించారు. విధివిధానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్ కమిటీ సమావేశం తర్వాత విధివిధానాలపై ప్రకటన చేయాలని కాంగ్రెసు నాయకత్వం అనుకుంటోంది. ఒకవేళ కోర్కమిటి సమావేశం కాకపోతే చిదంబరం విధివిధానాల ముసాయిదాతో ప్రధాని, సోనియాను కలిసి ఆమోదం తీసుకుని ప్రకటన చేయవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.