లాఠీచార్జిపై జర్నలిస్టులకు హోం మంత్రి హామీ
నిన్న సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని విద్యార్థులు ఆందోళన నిర్వహించడం, దాన్ని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మొదలైన పోలీసుల ప్రతాపం అంతకంతకూ పెరిగింది. తొలుత రాజీనామాచేయని కాంగ్రెస్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను విద్యార్థులు ప్రదర్శనగా ఎన్సీసీ గేటు వద్దకు ర్యాలీగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకొన్నారు.
బయటకు వెళ్లకుండా నిరోధించారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రాజీనామా చేయని ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను విద్యార్థులు ఎన్ సీసీ గేటు సమీపంలో దహనంచేశారు. తర్వాత ఆర్ట్స్ కళాశాల వద్దకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా తిరిగి వచ్చారు. ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాక వైపు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వారిని పోలీసులు నిరోధించారు. విద్యార్థులు మరింత దూకుడుగా ముందుకెళ్లేందుకు ప్రయత్నించడం, వారిని చెదరగొట్టేందుకు పారా మిలటరీ దళాలు ఒక్కసారిగా లాఠీలకు పనిచెప్పడంతో...అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.