ఇదే ఆఖరి పోరాటం: కోదండరామ్
తెలంగాణ కోసం విద్యార్థిలోకం గర్జిస్తుంటే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం ఎంతవరకు సమంజసమన్నారు. మానవ సృష్టిలో ఎంతో విలువైన ప్రాణాన్ని తెలంగాణ కోసం విద్యార్థులు వదులుకుంటున్నా ప్రజాప్రతినిధులకు చలనం కలగకపోవడం బాధాకరమన్నారు. అర్ధశతాబ్దానికి పైగా ప్రత్యేక పోరాటాలు నిర్వహించినా ప్రస్తుతం జరుగుతున్నది ఆఖరిపోరాటమని కోదండరాం అభివర్ణించారు. 2004, 2009 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి గెలిచిన పార్టీలు ఈ ప్రాంత ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాయన్నారు. ఎంతమంది లగడపాటిలు, మోహన్బాబులు, చిరంజీవులు వచ్చినా తెలంగాణ పోరాటాన్ని ఆపలేరన్నారు. సీమాంధ్రులకు వనరులు సమకూర్చే బీరు, బ్రాందీ సేవించడం మాని కల్లు తాగాలని సూచించారు.
రాష్ట్రం ఏర్పాటు కావాలన్నా, కేంద్రం దిగిరావాలన్నా ప్రభుత్వాలకు సహాయ నిరాకరణ చేయాల్సిందేనన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించాలని కోరారు. తెలంగాణ కోసం వేసింది శ్రీకృష్ణ కమిటీ కాదని, అది కంసుని కమిటీ అని ఆగ్రహంగా వ్యాఖ్యానిం చారు. నాలుగు కోట్ల ప్రజలు సాగిస్తున్నది బతుకు పోరాటమని, అందుకోసం బతికుండి పోరు సల్పాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం విద్యార్థులు చదువులు వదిలి పోరాటం చేస్తున్నారని, ఉద్యమాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పి చైతన్యపరుస్తున్న జర్నలిస్టులపై పాలకులు దాడి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.