వైభవంగా పెద్దింట్లమ్మ జాతర ఉత్సవాలు
28 వరకు జరుగు ఈ జాతర మహోత్సవంలో మొదటి ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు వాహనాలు, లాంచీల ద్వారా కొల్లేటికోటకు ఉదయమే చేరుకున్నారు. ఇటీవల జరిగిన పడవ ప్రమాదాల కారణంగా ఈ ఏడాది లాంచీల ఫెర్రి పాయింట్ వద్ద ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేశారు. సామర్థ్యానికి మించి భక్తులను బోటుల్లో అనుమతించలేదు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా గాలిగోపురం నుంచి క్యూలైన్ వరకు దేవస్థానం చలువ పందిళ్లను ఏర్పాటుచేసింది. కోనేరు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. దేవస్థాన ఆవరణలో మహిళలు పాలపొంగళ్లు వండి అమ్మవారికి సమర్పించారు.
జాతరకు విచ్చేసిన భక్తులకు కైకలూరుకు చెందిన పెనుమూడి నాగరాజు ప్రత్యేక ట్యాంకర్ ద్వారా మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. డీఎల్పీవో సత్యనారాయణరాజు, కైకలూరు తహశీల్దార్ డి.విజయశేఖర్రావు పనులను పర్యవేక్షించారు. ఆలయ చైర్మన్ బలే చిరంజీవి, మేనేజర్ శింగనపల్లి శ్రీనివాసరావు, ధర్మకర్తలు తిరుపతి వెంకన్న, మల్లిఖార్జునరావు, రామారావు, పెద్దింట్లమ్మ, గుడివాడ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పామర్తి సీతారామయ్య, కైకలూరు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.